ఆర్.జె.న్యూస్, బ్యూరో, హైదరాబాద్ : మాదాపూర్ పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ల ముందు, హాస్టళ్ల వద్ద పార్క్ చేసిన వాహనాలే లక్ష్యంగా ఈ చోరీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
🔸ఈజీ మనీ కోసం చోరీలు
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్కు చెందిన మేకల మణికంఠ నగరానికి వలస వచ్చి ఓ ప్రముఖ హోటల్లో ఫ్రంట్ ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం విలాసాలకు సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం బైక్ చోరీల బాట పట్టాడు. రాత్రి వేళల్లో మాదాపూర్, అయ్యప్ప సొసైటీ పరిసరాల్లో తిరుగుతూ.. తాళం వేయకుండా ఇళ్ల ముందు, హాస్టళ్ల వద్ద పార్క్ చేసిన బైక్లను టార్గెట్ చేసేవాడు. బైక్కు ఉన్న ప్లగ్ తొలగించి, వైర్లు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి స్టార్ట్ చేసుకొని పరారయ్యేవాడు.
పెట్రోలింగ్లో దొరికిపోయాడు ఇలా..
మాదాపూర్ పోలీసులు అయ్యప్ప సొసైటీ పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో సాధారణ తనిఖీలు (పెట్రోలింగ్) నిర్వహిస్తుండగా మణికంఠ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారించగా, తాను చేసిన మూడు బైక్ చోరీల గుట్టు విప్పాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతడి నివాసం సమీపంలో దాచి ఉంచిన 3 బైక్లను పోలీసులు రికవరీ చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు.