RJNEWS TELUGU
Newspaper Banner

ఉప్పల్‌లో ఓటర్ లిస్టు సవరణ పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ . అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు కాపాడాలని BLAలకు పిలుపు

ఉప్పల్, జూన్ 30 : మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా, చర్లపల్లి, రామంతపూర్ డివిజన్లలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సోమవారం పరిశీలించారు.
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడి సవరణ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి సంబంధిత బీఎల్ఓకు సమర్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ BLAలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారమ్‌లు అందేలా చూడాలని ఆదేశించారు.
“ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి అర్హుడి పేరు తుది ఓటరు జాబితాలో కొనసాగేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి” అని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.