RJNEWS TELUGU
Date of Publish : 12 September 2026, 4:09 pm Posted by : RJ NEWS TELUGU

ఓయూలో బీఆర్ఎస్వీ, దళిత విద్యార్థి సంఘాల నిరసన

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ నాయకులు దళితుల ముసుగులో నిర్వహించిన నిరసనను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు మిన్నంటాయి. బీఆర్ఎస్వీ, దళిత ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు కొంపల్లి నరేష్, గణేష్ మాదిగ మాట్లాడుతూ.. దళితులు, మాదిగల అంశాలను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద చావు డప్పులతో నిరసన చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపుతో దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని గుర్తుచేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దళిత విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.