ఆర్.జె.న్యూస్. మేడ్చల్ : రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో గణేష్ మండప నిర్వాహకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండప నిర్వాహకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, మండపాల ఏర్పాటు, భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు.గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రతి నిర్వాహకుడు తప్పనిసరిగా సంబంధిత వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని సూచించారు. మండపాల నిర్మాణ సమయంలో ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.మండపాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని నిర్వాహకులను కోరారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో పోలీసు శాఖకు నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జవహర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, అడ్మిన్ ఎస్సై రాము, సెక్టార్ ఎస్సైలు రవిబాబు, రమేష్తో పాటు పలువురు గణేష్ మండప నిర్వాహకులు పాల్గొన్నారు.