RJNEWS TELUGU
Date of Publish : 26 August 2026, 7:31 pm Posted by : RJ NEWS TELUGU

ట్రావెల్ బస్సులో గంజాయి స్మగ్లింగ్ – ఒకరు అరెస్ట్, ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడ్డ మహమ్మద్ ఖాదర్

🔸 మేడ్చల్‌లో 5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్

ఆర్ జె న్యూస్ మేడ్చల్ : ట్రావెల్‌ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 5 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో మహమ్మద్‌ ఖాదర్‌ (46)ను అరెస్టు చేశారు.బుధవారం తెల్లవారుజామున ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు ఫయాజ్‌, విష్ణుమూర్తి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐలు ఎం.పీ.ఆర్‌. చంద్రశేఖర్‌, బిక్షారెడ్డి ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి శివారులోని మలీబు రెస్టారెంట్‌ ఎదురుగా వాహన తనిఖీలు చేపట్టారు. నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్‌ బస్సుల్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో ప్రయాణికులను తనిఖీ చేశారు.

ఈ క్రమంలో ఇస్లాంపూర్‌, ఇచ్చోడ, ఆదిలాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ఖాదర్‌ హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా, ఐదు ప్యాకెట్లలో ఉన్న 5 కిలోల ఎండు గంజాయి బయటపడింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని ఖాదర్‌ను అరెస్టు చేశారు. విచారణలో గోల్కొండకు చెందిన మహమ్మద్‌కు గంజాయిని సరఫరా చేసి ఇద్దరూ కలిసి విక్రయిస్తున్నట్లు ఖాదర్‌ తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. నాగ్‌పూర్‌లో ఒడిశాకు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలో గంజాయిని రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో 50 గ్రాముల ప్యాకెట్‌ను రూ.500కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితుడిని మేడ్చల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించారు. గంజాయి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐలు బాల్‌రాజ్‌, సాయికిరణ్‌రెడ్డితో పాటు ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.