RJNEWS TELUGU
Date of Publish : 10 September 2026, 8:19 am Posted by : RJ NEWS TELUGU

పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు..! మేడ్చల్ జిల్లాలో 9వ పోషణ్ మాహ్

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు 9వ పోషణ్ మాహ్ కార్యక్రమాలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 8 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం ఐడీఓసీ కాంప్లెక్స్‌లో జిల్లా కలెక్టర్‌ 9వ పోషణ్‌ మాహ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

793 అంగన్‌వాడీల్లో కార్యక్రమాలు

జిల్లాలోని 793 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో నెల రోజుల పాటు వివిధ అవగాహన, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు, మహిళల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పోషకాహార లోపం, రక్తహీనత నివారణతో పాటు గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం, చిన్నారుల ఎదుగుదల, శిశువులకు సరైన పోషణ, అనుబంధ ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

ఎత్తు, బరువు పరిశీలన

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఎత్తు, బరువు తదితర వృద్ధి ప్రమాణాలను పర్యవేక్షించనున్నారు. తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు పోషకాహార ప్రదర్శనలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను వినియోగించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లలు, మహిళలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ప్రజలకు వివరించనున్నారు. ‘పోషకాహారం–ఆరోగ్యం–ఆరోగ్యకరమైన భవిష్యత్తు’ అనే సందేశాన్ని ప్రతి కుటుంబానికి చేరేలా సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. జిల్లా ప్రజలు, తల్లిదండ్రులు, మహిళలు, యువత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.