RJNEWS TELUGU
Date of Publish : 20 August 2026, 1:41 pm Posted by : RJ NEWS TELUGU

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

🔸మేడ్చల్‌ డిప్యూటీ ఎమ్మార్వో కు విద్యార్థి సంఘాల వినతి

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రైవేటీకరణ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టినా నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సాంకేతిక విద్యను పరిరక్షించడంతోపాటు కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మేడ్చల్‌ డిప్యూటీ ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంతాలు, కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. వీటిని ప్రైవేటీకరిస్తే విద్యార్థులపై అధిక ఫీజుల భారం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ సాంకేతిక విద్యకు నిధులు పెంచి కళాశాలలను బలోపేతం చేయాలని కోరారు.ఖాళీగా ఉన్న బోధనా, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని, తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, హాస్టళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల విద్య, హక్కులు, భవిష్యత్తు ఉపాధి అవకాశాలను కాపాడాలని కోరారు. కళాశాలలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపాలని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ,డి వై ఎఫ్ ఐ సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.