RJNEWS TELUGU
Date of Publish : 05 July 2026, 8:17 am Posted by : RJ NEWS TELUGU

బాలాజీ నగర్లో వివాహిత ఆత్మహత్య..! భర్త, అత్తమామలపై కేసు నమోదు..!

జవహర్ నగర్ ( ఆర్ జె న్యూస్) జూలై 5 :

బాలాజీ నగర్ శాంతినగర్ లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది.మృతురాలు మజ్జారి రేఖ (21), గృహిణి. ఆమెకు సుమారు మూడు సంవత్సరాల క్రితం సాయికిరణ (ఎక్సైజ్ కానిస్టేబుల్)తో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు గల కుమారుడు ఉన్నాడు. ఈనెల 3వ తేదీన మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని వేళ, రేఖ తన ఇంటి బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత ఆమె అత్త ఇంటికి వచ్చి చూడగా, రేఖ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వడంతో, వారు ఆమెను కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించింది. అనంతరం మృతురాలి తల్లి జయమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని, తన కుమార్తె మరణానికి భర్త సాయికిరణ్ పాటు అత్త, మామలే కారణమని ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.