RJNEWS TELUGU
Date of Publish : 12 September 2026, 4:26 pm Posted by : RJ NEWS TELUGU

బాలాపూర్ గణేష్ ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు.. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణ పూరి జగన్నాథ ఆలయ నమూనా

ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ నమూనాను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆలయ నమూనా నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు ఉత్సవ సమితి వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నామని, వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు అన్ని కార్యక్రమాలను క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు.