RJNEWS TELUGU
Date of Publish : 07 September 2026, 6:38 pm Posted by : RJ NEWS TELUGU

మట్టి గణపతిని ప్రతిష్టిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రజలకు పిలుపునిచ్చింది. వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతి విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరీ, ఐఏఎస్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, మేడ్చల్ పర్యావరణ ఇంజనీర్, నోడల్ అధికారి బి. రాజేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై రూపొందించిన అవగాహన గోడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాల స్టాల్‌ను ప్రారంభించి కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది, సాధారణ ప్రజలకు విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

🔸కాలుష్యానికి చెక్ పెట్టేలా..

రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని అధికారులు సూచించారు. “మట్టి గణపతిని ప్రతిష్టిద్దాం –పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ప్రతి సంవత్సరం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, మేడ్చల్‌కు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.