ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 165 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను పరిష్కరించినట్లు ట్రాఫిక్ సీఐ క్రాంతి కుమార్ తెలిపారు. మేడ్చల్ కోర్టులో జరిగిన లోక్ అదాలత్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 112 కేసులకు రూ.2.03 లక్షలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 53 కేసులకు రూ.53 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.మొత్తంగా 165 కేసులకు సంబంధించి రూ.2.56 లక్షల జరిమానా వసూలైనట్లు సీఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 29 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని సీఐ క్రాంతి కుమార్ తెలిపారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.