ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఈ నెల 15న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.వేడుకలకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ముఖ్య అతిథికి పోలీసుల గౌరవ వందనం, బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. వేదిక, కుర్చీలు, బారికేడింగ్, సీటింగ్ ఏర్పాట్లను ఆర్అండ్బీ శాఖ, వేదిక అలంకరణను ఉద్యానవన శాఖ అధికారులు చేపట్టాలని సూచించారు.మైక్, సౌండ్ బాక్సుల ఏర్పాట్లను ఐఅండ్పీఆర్ శాఖ అధికారులు చేయాలని, విద్యార్థులతో దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు ఆయా శాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కోరారు.కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి, కీసర ఆర్డీఓ వెంకట్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
