ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : హెచ్ఐవీ నియంత్రణలో నిర్దేశించిన 95-95-99 లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎయిడ్స్ సురక్ష (MAS) కార్యక్రమంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మంది తమ ఆరోగ్య స్థితిని తెలుసుకునేలా చేయడం, నిర్ధారణ పొందిన వారిలో 95 శాతం మందిని ఏఆర్టీ చికిత్సలో చేర్చడం, చికిత్స పొందుతున్న వారిలో వైరల్ సప్రెషన్ సాధించేలా చర్యలు చేపట్టడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో హెచ్ఐవీ పరీక్షలు, కేసుల ముందస్తు గుర్తింపు, ఏఆర్టీ కేంద్రాలకు అనుసంధానం, వైరల్ లోడ్ పరీక్షలు, ఫాలోఅప్ సేవలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఐసీటీసీలు, ఏఆర్టీ కేంద్రాలు, జిల్లా హెచ్ఐవీ కేర్ యూనిట్ సేవలను విస్తరించడంతో పాటు ప్రభుత్వ శాఖలు, ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాను “సక్షమ్” కేటగిరీ నుంచి “సురక్షిత్” కేటగిరీకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ మాట్లాడుతూ హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేసి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యక్రమ అధికారి (ఎయిడ్స్ & కుష్ఠు) డా. వై. శ్రీదేవి, డిశా ప్రోగ్రామ్ మేనేజర్ ఎం. సంజీవ్, డీఎండీవో కె. గణేష్, ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.