🔸కాంగ్రెస్ ప్రభుత్వంపై భాస్కర్ యాదవ్ విమర్శలు
297వ డివిజన్లో నిరసన కార్యక్రమం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆరోపించారు. మేడ్చల్లోని 297వ డివిజన్లో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయ్ ఏడు రోజులో వివిధ కార్యక్రమాలతో ఆందోళనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మేడ్చల్ ప్రజలకు తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో మేడ్చల్లో పరిస్థితులు ఎలా ఉండేవి.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉన్నాయో ప్రజలే పోల్చి చూస్తున్నారని భాస్కర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు దయానంద యాదవ్, సందీప్ గౌడ్, మెట్టు గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, విష్ణు చారి, రఘు, శంకర్, మహేష్ యాదవ్, మల్లేష్, శ్రీశైలైంధర్, పాండు, ప్రతాప్, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు