RJNEWS TELUGU
Date of Publish : 09 August 2026, 7:20 pm Posted by : RJ NEWS TELUGU

గౌడవెల్లిలో ఘనంగా బోనాల పండుగ

ఆర్.జె.న్యూస్, గుండ్లపోచంపల్లి : గుండ్లపోచంపల్లి డివిజన్‌ గౌడవెల్లిలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామదేవత పోచమ్మ తల్లికి గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి, ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బోనాల పండుగను పురస్కరించుకుని మాజీ ఎంపీపీ పద్మ జగన్‌రెడ్డి పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఇంటి నుంచి తీసుకువచ్చిన బోనాన్ని అమ్మవారికి సమర్పించి, ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పద్మ జగన్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అనాదిగా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే ప్రజలకు ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.