🔸పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఫైజాన్ అహ్మద్
ఆర్ జె న్యూస్ బ్యూరో : పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్అన్నారు. వనమహోత్సవంలో భాగంగా దుండిగల్ వేస్ట్ టు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రాంగణంలో పరిశ్రమల శాఖ, ఫ్యాక్టరీల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు ప్రణాళికాబద్ధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా సీఎస్ఆర్ కార్యక్రమాలతో పాటు వనమహోత్సవం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ డి. వినయ్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ మనోహర్ రెడ్డి, దుండిగల్ వేస్ట్ టు ఎనర్జీ సంస్థ ప్రతినిధులు రమేష్, గోపినాథ్, సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.