RJNEWS TELUGU
Date of Publish : 08 August 2026, 7:46 pm Posted by : RJ NEWS TELUGU

పట్టుదలతోనే ఏదైనా సాధించవచ్చు

🔸రెండు సంవత్సరాలు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు : మేడ్చల్ జోన్ ఏసీపీ సిహెచ్. శంకర్ రెడ్డి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్: జీవితంలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మేడ్చల్ జోన్ ఏసీపీ సిహెచ్. శంకర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు రెండేళ్ల పాటు కష్టపడి చదివితే ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని ఆయన సూచించారు. మేడ్చల్ పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం శ్రీ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ సిహెచ్. శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యసాధనపై దృష్టి సారించాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలని అన్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల సూచనలు పాటిస్తూ విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సామాజికవేత్త మంజులాదేవి మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు, గురువుల బోధనను శ్రద్ధగా వినాలని మంచి బాటలో నడవాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే మంచి తరుణమని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల నృత్యాలు, పాటలు, ఇతర కళా ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎస్ ఐ భానుచందర్ గౌడ్, కళాశాల యాజమాన్య సభ్యులు మంజుల ప్రకాష్, కమలాకర్ రెడ్డి, దేవరాజ్, గణేష్, రామ్ శంకర్, సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.