ఆర్ జె న్యూస్ క్రైమ్ బ్యూరో : జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో సొంత మామను అల్లుడు హత్య చేసిన ఘటన అంబేద్కర్నగర్ దొండతోటలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అంబేద్కర్నగర్ దొండతోటకు చెందిన శివ (32) తన మామ మొగిలి (48) ని నిన్న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జవహర్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలేనా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.