🔸భర్త మంచోడే.. కాపురం విడదీస్తున్నది అత్తేనంటూ బాధితురాలి ఆవేదన
ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : అత్త, ఆడపడుచు కలిసి కోడలిపై దాడి చేసి కాలు ఇరగ్గొట్టిన ఘటన చోటు చేసుకుంది. తన భర్త మనీష్ నాయక్ మంచివాడేనని, అయితే అత్త, ఆడపడుచు కలిసి తన కాపురాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు రజిత ఆరోపించారు. అత్త, ఆడపడుచు కలిసి తనపై దాడి చేసి కొట్టడంతో పాటు తన ఎడమ కాలును ఇరగ్గొట్టారని ఆమె వాపోయారు. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పి వేధిస్తున్నారని ఆరోపించారు. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానని రజిత తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల జోక్యం కారణంగా తమ దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రజిత తరఫున సేవాలాల్ బంజారా మహిళా సంఘాల ప్రతినిధులు స్పందించారు. రజితకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. దంపతుల కాపురాన్ని విడదీయకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రజితపై జరిగిన దాడిపై విచారణ జరిపి ఆమెకు న్యాయం చేయాలని కోరారు. మనీష్ నాయక్, రజిత దంపతులు కలిసి జీవించేలా కుటుంబ పెద్దలు, సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.