ఆర్. జె.న్యూస్, మేడ్చల్ : సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి సూచించారు. జీనోమ్ వ్యాలీ పోలీస్స్టేషన్ పరిధిలోని హెచ్బీఎల్ కంపెనీలో బుధవారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ ఎసిపి శంకర్ రెడ్డి మాట్లాడుతూ అనుమానాస్పద లింకులు, ఫోన్కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.అనంతరం జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తత తప్పనిసరని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, హెచ్బీఎల్ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
