ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో మంగళవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థినులు పట్టణంలోని ఏడు గుడుల దేవాలయంలో కొలువైన అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థినులకు తెలియజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థినుల సంప్రదాయ వస్త్రధారణ, బోనాల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు గణేష్, శివ, కమలాకర్ రెడ్డి, దేవరాజ్, సత్యనారాయణ, శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.