RJNEWS TELUGU
Date of Publish : 10 August 2026, 5:25 pm Posted by : RJ NEWS TELUGU

దమ్మాయిగూడ శ్రీచైతన్య హాస్టల్లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి

ఆర్జె..న్యూస్,దమ్మాయిగూడ/మేడ్చల్ మల్కాజ్గిరి : దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి సీనియర్ విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థి అభిషేక్‌పై రాత్రి సమయంలో 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసినట్లు, అంతేగాక బూట్లతో ముఖంపై తొక్కినట్లు బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడ్డాడు. మెట్లపై నుంచి కిందపడటంతో గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే పాఠశాలకు వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు వెల్లడించారు. తనపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని అభిషేక్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై, అలాగే ఘటనను బయటకు రాకుండా దాచేందుకు ప్రయత్నించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని, ఇతర విద్యార్థుల వాంగ్మూలాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.