RJNEWS TELUGU
Date of Publish : 20 August 2026, 9:35 pm Posted by : RJ NEWS TELUGU

22ఏ, యూఎల్‌సీ దరఖాస్తుల క్లియరెన్స్‌ వేగవంతం చేయాలి

ఆర్.జె.న్యూస్, శామీర్ పేట : 22ఏ నిషేధిత భూములు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) పరిధిలోని దరఖాస్తుల క్లియరెన్స్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని యూఎల్‌సీ విభాగాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 22ఏ నిషేధిత భూముల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం రీటైనబుల్‌ భూముల వివరాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. యూఎల్‌సీకి సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి హాల్‌లో వివిధ మండలాల నుంచి వచ్చిన సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, డీఐలు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. యూఎల్‌సీ ఆన్‌లైన్‌ డేటాను త్వరితగతిన క్లియర్‌ చేసేందుకు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైతే రాత్రి వేళల్లోనూ పనులు నిర్వహించి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ ఆదేశించారు.