ఆర్.జె.న్యూస్, బొల్లారం : హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న ఆయుధాల గదిలోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆయుధాల గది తాళం పగులగొట్టి 12 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. చోరీకి గురైన వాటిలో 4 ఏకే-47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని కూడా అపహరించారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం బొల్లారం పోలీసులకు ఆర్మీ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రక్షణ వ్యవహారం కావడంతో కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. మద్రాస్ రెజిమెంట్లోకి అనుమతి ఉన్న వ్యక్తులు మినహా ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో సిబ్బందిలోనే ఎవరైనా చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆయుధాలు బరువుగా ఉండటంతో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ చోరీలో పాల్గొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రెజిమెంట్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆర్మీ అధికారులు సిబ్బందిని అంతర్గతంగా విచారిస్తున్నారు.