RJNEWS TELUGU
Date of Publish : 16 August 2026, 8:16 am Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్‌లో పగటిపూట చైన్ స్నాచింగ్

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ జిల్లా కేంద్రంలో పగటిపూట చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ రైల్వే స్టేషన్ రోడ్డుకు చెందిన జక్కుల సుజాత (58) ఒంటరిగా వెళ్తుండగా, హెల్మెట్‌లు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పల్సర్ బైక్‌పై వేగంగా వచ్చారు. క్షణాల్లో సుజాత మెడలోని బంగారు గొలుసును సుమారు 3.5  తులాలు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో బాధితురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. కంగారుపడిన సుజాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇటీవల కాలంలో మేడ్చల్ పట్టణంలో ఇలాంటి చైన్ స్నాచింగ్ ఘటనలు పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.