RJNEWS TELUGU
Date of Publish : 18 September 2026, 6:25 am Posted by : RJ NEWS TELUGU

టీడీ టీకా శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌వో

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్‌ మండలం కిస్తాపూర్‌ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న టీడీ (టెటనస్‌–డిఫ్తీరియా) టీకా శిబిరాన్ని మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె. ఆనంద్‌ గురువారం సందర్శించారు. టీకా కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించారు.విద్యార్థినుల హాజరు, అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల జాబితా, టీకా రిజిస్టర్‌, ఆన్‌లైన్‌ నమోదు తదితర వివరాలను పరిశీలించారు. వ్యాక్సిన్‌ క్యారియర్‌, కోల్డ్‌చైన్‌ నిర్వహణ, సిరింజ్‌లు, టీకా వ్యర్థాల నిర్వహణపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన విద్యార్థినులందరికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.టీకా వేసే ముందు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని, టీకా అనంతరం అసౌకర్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. వ్యాక్సిన్‌లను నిర్దేశిత ఉష్ణోగ్రతలో భద్రపరచాలని, గడువు తేదీ, బ్యాచ్‌ నంబర్‌ పరిశీలించిన తర్వాతే వినియోగించాలని ఆదేశించారు. టీకా శిబిరంలో సిరింజ్‌లు, పత్తి, వ్యర్థాల సేకరణ బాక్సులు, అత్యవసర వైద్య సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు.