RJNEWS TELUGU
Date of Publish : 17 August 2026, 9:38 pm Posted by : RJ NEWS TELUGU

సెప్టెంబర్‌ 1 నుంచి ఆగనున్న ఉచిత పార్థివ వాహన సేవలు?

ఆర్ జె.న్యూస్,మేడ్చల్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతిచెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల వారి మృతదేహాలను ఉచితంగా స్వగ్రామాలు, ఇళ్లకు తరలించే పార్థివ వాహన సేవలు సెప్టెంబర్‌ 1 నుంచి నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ఈ సేవలు నిలిచిపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతదేహాలను ఇంటికి తరలించేందుకు ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నిర్వాహకులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్న నేపథ్యంలో, పేదలకు అండగా ఉండేందుకు 2016 నవంబర్‌లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 50 పార్థివ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్వహణ బాధ్యతలను టెండర్‌ ద్వారా ఓ కార్పొరేట్‌ సంస్థకు అప్పగించింది.అయితే గత రెండేళ్లుగా నిర్వహణ సంస్థకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో వాహనాల సిబ్బంది జీతాలు, డీజిల్‌, మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. దీంతో సేవలను నిరంతరంగా కొనసాగించడం కష్టంగా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు.నిధుల విడుదలపై నిర్వహణ సంస్థ అధికారులు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సేవలను నిలిపివేయనున్నట్లు నిర్వహణ సంస్థ ప్రభుత్వం దృష్టికి ఒక నెల ముందస్తు నోటీసు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్‌ 1 నుంచి పార్థివ వాహన సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

🔸108, 102 సేవలపైనా ప్రభావం?

ఇదే తరహాలో 108, 102 అత్యవసర సేవల నిర్వహణకు సంబంధించిన నిధుల విడుదలలోనూ జాప్యం జరుగుతున్నట్లు ఉద్యోగులు, అధికారులు పేర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ సేవల నిర్వహణ కూడా భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

🔸ప్రభుత్వం వెంటనే స్పందించాలి

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న పార్థివ వాహన సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆప్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబాలు ప్రైవేట్‌ అంబులెన్స్‌లకు భారీ మొత్తాలు చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేసి సేవలను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.