అర్.జె.న్యూస్, మేడ్చల్ : వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గంలోని 146 గణేష్ మండపాల నిర్వాహకులకు ఉచితంగా ఎల్ఈడీ లైట్లను పంపిణీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో దేవరయాంజల్, శివశివాని కాలనీ, మల్లన తండా, హకీంపేట్, సింగాయిపల్లి, పోతాయిపల్లి, తూంకుంట, శామీర్పేట్, కొంపల్లి, బహదూర్పల్లి, జవహర్నగర్ తదితర ప్రాంతాల్లోని మండపాలకు లైట్లు అందజేశారు.ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గణేష్ మండపానికి ప్రభుత్వం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. మండపాల నిర్వాహకులు విద్యుత్ వైరింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండి, విద్యుత్ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలీస్ శాఖ వద్ద ఉచితంగా అనుమతి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మహిపాల్ రెడ్డి కోరారు.