RJNEWS TELUGU
Date of Publish : 12 August 2026, 9:24 pm Posted by : RJ NEWS TELUGU

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఖరీఫ్‌ 2026–27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు జిల్లా కలెక్టర్‌ (పౌరసరఫరాలు) డి. విజయేందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆయన అధ్యక్షతన ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ ఎల్. సుగుణ బాయి, వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి ఎం.డి. రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. కొనుగోళ్లకు అవసరమైన మేరకు గన్నీలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని తడి, తాలు, దుమ్ము లేకుండా శుభ్రపరిచి, బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అవగాహన కల్పించాలన్నారు. వరికోత సమయంలో నూర్పిడి యంత్రాల యజమానులతో సమన్వయం చేసుకుని ధాన్యం క్రమపద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్యాబ్‌ ఎంట్రీల్లో జాప్యం కారణంగా రైతుల చెల్లింపులు ఆలస్యం కాకుండా ప్రతి ఎంట్రీని అదే రోజు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లోపు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో నిరంతరం సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేసి జిల్లాకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్‌ సూచించారు.