మేడ్చల్, జూన్ 30: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ నాయకులు సోమవారం డిప్యూటీ ఎంఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, జీఓ నెం.12ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కార్యదర్శి ఎం. నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 22-07-2025న విడుదల చేసిన జీఓ నెం.12 ద్వారా ప్రమాద మరణం, సహజ మరణం, అంగవైకల్యం స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిందని తెలిపారు. “ట్రెయిల్ బ్లెజర్ అనే బ్రోకర్స్ సంస్థ ద్వారా రూ.346 కోట్లు ప్రైవేట్ బీమా కంపెనీలకు బదిలీ చేశారు. కార్మికులకు ఉపయోగం లేని సిఎస్సి హెల్త్ టెస్టుల కోసం రూ.750 కోట్లకు పైగా ఖర్చు చేసి వెల్ఫేర్ బోర్డు నిధులు దుబారా చేశారు” అని ఆరోపించారు.
నిబంధనల ఉల్లంఘన
1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ నిర్ణయం మేరకే నిధులు ఖర్చు చేయాలని, కానీ కమిటీని నియమించకుండానే గుర్తింపు లేని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములు అప్పగించారని నరేష్ విమర్శించారు. “రాష్ట్రంలో 28.50 లక్షల మంది నమోదైన కార్మికుల్లో 15 లక్షల మందిని మాత్రమే రెన్యువల్ చేసి, ఒక్కొక్కరికి రూ.2,309 చొప్పున రూ.346.36 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టారు” అని తెలిపారు.
రూ.200 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకే
2025 జూలై 24 నుంచి ఇప్పటివరకు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించిన నష్టపరిహారం కేవలం రూ.140 కోట్లు మాత్రమేనని, సుమారు రూ.200 కోట్లు కంపెనీలకు మిగిలాయని పేర్కొన్నారు. “బోర్డు నుండి డేటా ఇవ్వలేదని సాకు చూపి వేలాది మంది కార్మికులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు. 13 లక్షల మంది కార్డులు రెన్యువల్ చేయకుండా అన్యాయం చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.