🔸500 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి నిందితుల గుర్తింపు
ఆర్ జె న్యూస్, చందానగర్ : చందానగర్లోని బాలాజీ జ్యువెల్లర్స్లో జరిగిన చోరీ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చందానగర్ క్రైమ్, సీసీఎస్ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 500 సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పటికే మరో దొంగతనం కేసులో గ్వాలియర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దీంతో పీటీ వారెంట్ల ద్వారా నిందితులను చందానగర్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా కథా గ్రామంలో చోరీ సొత్తును దాచినట్లు వెల్లడించారు. పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి 59.220 గ్రాముల కరిగించిన బంగారు బార్, సుమారు 2 కిలోల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. మరో కిలో వెండిని ఆశిష్ తోని అనే వ్యక్తికి విక్రయించినట్లు నిందితులు తెలిపారు. ప్రస్తుతం ఆశిష్ తోని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను గ్వాలియర్ నుంచి చందానగర్కు తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.