RJNEWS TELUGU
Date of Publish : 25 August 2026, 6:51 pm Posted by : RJ NEWS TELUGU

ఇంటికి తాళం వేసి వెళ్లగా.. చోరీ

ఆర్ జె న్యూస్ బ్యూరో : ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ కుటుంబం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బొలారం బ్రిందావన్‌ రైల్‌ నివాస్‌ కాలనీకి చెందిన వి. శైలజ (40) కుటుంబంతో కలిసి ఈ నెల 22న ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్య మెట్‌పల్లికి వివాహ కార్యక్రమానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్లారు.
ఈ నెల 25న అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఇంటికి తిరిగి రాగా.. ప్రధాన ద్వారం ల్యాచ్‌ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా బెడ్‌రూమ్‌లోని అల్మారా రెండు డ్రాయర్లు పగులగొట్టి ఉండగా.. దుస్తులు, ఇతర వస్తువులు మంచంపై చిందరవందరగా కనిపించాయి. అల్మారాలోని సుమారు 24.5 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, రూ.10 వేల నగదు కనిపించలేదు.
దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసినట్లు పేర్కొంటూ శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.