ఆర్ జె న్యూస్ హైదరాబాద్ : డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మేడ్చల్ ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి, పద్మలత, కృష్ణవేణి, రజిత, విమల, భాగ్యతార, రమణి, నాగమ్మ, జయసుధ, లక్ష్మి, సుజాత తదితర ఆశా కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. అసెంబ్లీకి కొద్ది దూరంలోనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సంబు ప్రభాకర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదని విమర్శించారు. ఉద్యమాలను పోలీసులతో అణిచివేయాలని చూస్తే సహించబోమని, డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.