ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : అర్హులైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేదలకు ‘డాక్టర్ అంబేద్కర్ వైద్య సహాయ పథకం’ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఈ పథకాన్ని 2004 జనవరి నుంచి అమలు చేస్తోందని తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు తీవ్రమైన వ్యాధులకు చికిత్స పొందేందుకు ఈ సాయం పొందవచ్చన్నారు.
🔸 గరిష్ఠ సాయం ఇలా..
గుండె శస్త్రచికిత్సకు రూ.1.50 లక్షలు
మూత్రపిండాల శస్త్రచికిత్స/డయాలసిస్కు రూ.3.50 లక్షలు
క్యాన్సర్ శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీకి రూ.2.50 లక్షలు
మెదడు శస్త్రచికిత్సకు రూ.2 లక్షలు
మూత్రపిండం/ఇతర అవయవ మార్పిడికి రూ.3.50 లక్షలు
వెన్నెముక శస్త్రచికిత్సకు రూ.1.50 లక్షలు
ఇతర ప్రాణాంతక వ్యాధులకు రూ.2 లక్షల వరకు
🔸2026లో పథకానికి సవరణలు
పథకం పరిధిని విస్తరించేందుకు 2026లో సమగ్రంగా సవరించినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో అర్హత కలిగిన వ్యాధుల పరిధితోపాటు ఎంప్యానెల్డ్ ఆసుపత్రులు కూడా పెరిగినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు నిర్దేశిత నమూనాలో పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫారమ్లు, మార్గదర్శకాలు, ఇతర వివరాల కోసం DAF అధికారిక వెబ్సైట్ dosje.gov.inను సంప్రదించాలని సూచించారు.