ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వినాయక్ నగర్ డివిజన్లోని చంద్రగిరి కాలనీ మీదుగా ప్రతిపాదించిన రైల్వే అండర్ వంతెన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు, పడమర చంద్రగిరి కాలనీ, సంతోష్ మా నగర్, పరిసర ప్రాంతాల కాలనీవాసులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. సూర్యోదయ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్లో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు “మాకొద్దు అండర్ వంతెన” అంటూ నినాదాలు చేస్తూ, ప్రత్యామ్నాయ మార్గంలో వంతెన నిర్మించాలని శాసనసభ్యులకు వినతిపత్రం అందజేశారు. వంతెన నిర్మాణంతో ఇళ్లు, ఆస్తులు కోల్పోయే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనివ్వబోమని స్పష్టం చేశారు. స్థానికుల ఇళ్లు, ఆస్తులకు నష్టం కలగకుండా ప్రతిపాదనను పునఃపరిశీలించేలా రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి నాయకులు, కాలనీవాసులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.