🔸రైతులకు ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన
ఆర్ జె న్యూస్, శామీర్ పేట : మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దమర్రి గ్రామంలో గురువారం గ్రంథాలయం వద్ద ఉద్యాన, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూరగాయల పరిశోధన కేంద్రం, SKLTG హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన సీనియర్ సైంటిస్ట్ డా. జె. శ్రీనివాస్ రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… కూరగాయల సాగులో అధిక దిగుబడుల కోసం విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా, నేల స్వభావాన్ని కాపాడే సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు, సహజ పద్ధతుల్లో పురుగు నివారణ, పంటల మార్పిడి, నేల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై రైతులకు వివరించారు. సేంద్రియ పద్ధతులతో సాగు చేయడం వల్ల నేల సారవంతతను కాపాడటంతో పాటు పంటల నాణ్యత మెరుగుపడుతుందని, సాగు ఖర్చులను నియంత్రించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కూరగాయలపై పురుగు, తెగుళ్ల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ–ఉద్యాన శాఖల అధికారుల సలహాలు తీసుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు లత, శ్రీలత, లత, ప్రోగ్రెసివ్ రైతు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఉద్యాన శాఖ అధికారులు స్వప్నిక, వెంకట్ రమణ, వ్యవసాయ అధికారి ప్రవీణ, ఏ.ఈ.ఓ సురేష్, హెచ్.ఈ.ఓ సంధ్య, ఎఫ్.పి.ఓ అధ్యక్షుడు సీతారామరావు, మట్టి శాస్త్రవేత్త, SPIK మేనేజర్ హుస్సేన్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు సేంద్రియ కూరగాయల సాగుకు సంబంధించిన పలు అంశాలపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు. శాస్త్రీయ అవగాహనతో, పర్యావరణహిత పద్ధతులతో సాగు చేపట్టి నాణ్యమైన దిగుబడులు సాధించాలని అధికారులు రైతులకు సూచించారు.