RJNEWS TELUGU
Date of Publish : 20 August 2026, 8:11 am Posted by : RJ NEWS TELUGU

బూత్‌ కమిటీలతో ప్రజలకు సేవ చేయాలి – డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులకు అవకాశం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని, అయితే బూత్‌ కమిటీ అధ్యక్షులు, సభ్యులుగా ప్రజలకు నిరంతరం సేవ చేయవచ్చని మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ అన్నారు.తూంకుంటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి శామీర్‌పేట డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డివిజన్‌ అధ్యక్షుడు నక్క సందీప్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. ఇటీవల విజయవంతంగా పూర్తిచేసిన ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో సమష్టిగా కృషి చేసిన బీఎల్‌ఓలను ఈ సందర్భంగా సన్మానించారు.వజ్రేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేయనున్న శామీర్‌పేట డివిజన్‌ కాంగ్రెస్‌ కమిటీలో అన్ని కులాలకు చెందిన అనుభవజ్ఞులైన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయామని ఎవరూ అధైర్యపడొద్దని, బూత్‌ కమిటీల ద్వారా ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బూత్‌ కమిటీ సమావేశం, నెలకోసారి డివిజన్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా అభ్యర్థిని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఇతర పార్టీల నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గతంలో ఏం అభివృద్ధి చేశారో ప్రశ్నించాలని అన్నారు.జీహెచ్‌ఎంసీలో విలీనం తర్వాత అనేక సమస్యలు, పెండింగ్‌ పనులు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పూర్తి స్థాయి డివిజన్‌ కమిటీతో పాటు బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు స్థానిక సమస్యలను ప్రస్తావించారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, పలు సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింహులు యాదవ్‌, ఆర్టీఏ మెంబర్‌ జైపాల్‌రెడ్డి, హజ్‌ కమిటీ మెంబర్‌ ముజిబుద్దీన్‌, జిల్లా ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు గువ్వ రవి, రాష్ట్ర నాయకులు హరివర్ధన్‌రెడ్డి, నక్క ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఉదండపురం సత్యనారాయణ, డివిజన్‌ అధ్యక్షుడు నక్క సందీప్‌గౌడ్‌, నాయకులు మహేందర్‌యాదవ్‌, శంకర్‌గౌడ్‌, అశోక్‌, మహేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.