🔸 అలియాబాద్ ప్రజలకు మున్సిపల్ ఛైర్పర్సన్ శిరీష కృష్ణారెడ్డి పిలుపు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అలియాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు డ్రైనేజీల్లో ప్లాస్టిక్ పేరుకుపోయి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు.ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తగ్గించాలని సూచించారు. మార్కెట్లు, దుకాణాలకు వెళ్లేటప్పుడు క్లాత్, జూట్ బ్యాగులను వినియోగించాలని కోరారు. వ్యాపారులు సైతం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించారు.పరిశుభ్రమైన అలియాబాద్–ప్లాస్టిక్ రహిత అలియాబాద్ లక్ష్యంగా మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేడు మనం తీసుకునే చిన్నచిన్న మార్పులు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కేవలం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఛైర్పర్సన్ శిరీష కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.