RJNEWS TELUGU
Date of Publish : 14 September 2026, 7:48 am Posted by : RJ NEWS TELUGU

అమ్మవారి ఆలయంలో చోరీ.. వెండి కిరీటం, మంగళసూత్రం మాయం

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి పూజలు ముగించుకుని ఆలయానికి తాళం వేసి వెళ్లిన పూజారి నరేష్, ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి ఆలయ తాళాలు పగలగొట్టి ఉండటం గమనించారు. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలోకి ప్రవేశించి చూడగా అమ్మవారి అర్ధ తులం బంగారు మంగళసూత్రం, 16 తులాల వెండి కిరీటం, రెండు తులాల వెండి ముక్కుపుడకను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చోరీ అయిన ఆభరణాల విలువ సుమారు రూ.14,600 ఉంటుందని అంచనా. సమాచారం అందుకున్న మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.