RJNEWS TELUGU
Date of Publish : 18 September 2026, 7:44 pm Posted by : RJ NEWS TELUGU

ఎస్‌ఐఆర్‌ హియరింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

🔸ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌లో తప్పులకు తావులేకుండా చూడాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి

ఆర్.జె న్యూస్, మేడ్చల్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల హియరింగ్‌, ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉప్పల్‌, హబ్సిగూడ ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ హియరింగ్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఓటు నిర్ధారణ ప్రక్రియ, ఎన్నికల సంఘం నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాల సమర్పణ, క్షేత్రస్థాయి సహాయం, రికార్డుల పరిశీలన, ధ్రువీకరణ తీరును స్వయంగా పరిశీలించారు. మ్యాపింగ్‌ జరగని ఓటర్లు, ఓటరు కార్డుల్లోని వ్యత్యాసాలు (అనామలీస్‌) కేటగిరీలకు సంబంధించిన రికార్డులు, దరఖాస్తుల పరిశీలనను నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు.నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు హాజరైనప్పుడు వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన ఆధారాలను ధ్రువీకరించిన అనంతరమే తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులైన ఓటర్ల వివరాలు క్రమపద్ధతిలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.నిర్దేశిత గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా తగిన సిబ్బందిని నియమించి, రోజువారీ లక్ష్యాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని తెలిపారు. హియరింగ్‌, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న రిజిస్టర్లు, కంప్యూటర్లలో ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఉప్పల్‌ తహసీల్దార్‌ పూల్‌సింగ్‌, డిప్యూటీ కమిషనర్‌, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.