RJNEWS TELUGU
Date of Publish : 18 September 2026, 7:34 pm Posted by : RJ NEWS TELUGU

గోవా నుంచి వచ్చిన ముగ్గురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

🔸5 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌ స్వాధీనం

🔸ఎస్‌ఓటీ అదుపులో నిందితులు.. పెట్‌బషీరాబాద్‌ పోలీసులకు అప్పగింత

ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : గోవా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ముగ్గురిని సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 5 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికీ పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది.ఆశిష్‌రెడ్డి (26), కుందన్‌రావు (28)తో పాటు వారి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవాలో మాదకద్రవ్యాలు సేవించిన అనంతరం హైదరాబాద్‌కు తిరిగొచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తనిఖీల్లో వారి వద్ద మాదకద్రవ్యాలు లభించడంతో ముగ్గురినీ, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను తదుపరి చర్యల కోసం పెట్‌బషీరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

సరఫరా ఎక్కడి నుంచి?

స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటిని ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో పెట్‌బషీరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ వెనుక ఉన్న సరఫరా వ్యవస్థపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.