RJNEWS TELUGU
Date of Publish : 20 August 2026, 7:21 pm Posted by : RJ NEWS TELUGU

ల్యాబ్ టెక్నీషియన్ మెడలో గొలుసు లాగేందుకు యత్నం

ఆర్.జె.న్యూస్, క్రైమ్ బ్యూరో : రక్త నమూనాల సేకరణకు వెళ్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు ఇద్దరు దుండగులు యత్నించిన ఘటన గురువారం అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. పాత అల్వాల్‌లోని గణేష్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన ఓ మహిళ సూర్యనగర్‌లోని లోటస్‌ డయాగ్నోస్టిక్స్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. గురువారం ఉదయం రక్త నమూనాల సేకరణ కోసం తన మోపెడ్‌పై సెయింట్‌ మైఖేల్‌ స్కూల్‌ నుంచి కేబీఆర్‌ రెసిడెన్సీ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఎరుపు, నలుపు రంగుల పల్సర్‌ బైక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వెంబడించారు. కేబీఆర్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఆమె వాహనాన్ని నిలిపిన సమయంలో దుండగులు పక్కనే బైక్‌ను ఆపి, వెనుక కూర్చున్న వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసు (మంగళసూత్రం తాడు) లాక్కునేందుకు ప్రయత్నించాడు.అప్రమత్తమైన ఆమె గొలుసును గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల్లో బైక్‌ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించగా, వెనుక కూర్చున్న వ్యక్తి క్యాప్‌ పెట్టుకుని బ్యాగ్‌ ధరించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.