ఆర్.జె.న్యూస్, హైదరాబాద్ : యూకే వీసా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లండన్లో పర్మినెంట్ ఉద్యోగాలు, భారీ వేతనాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్న ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్ RGIA ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి మోసాలకు పాల్పడిన నందన దంపతులపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదులతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నందనను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిరుద్యోగులు ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు.