RJNEWS TELUGU
Date of Publish : 16 September 2026, 8:58 pm Posted by : RJ NEWS TELUGU

పండగకు ఊరెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో చోరీ

10 తులాల బంగారం.. 12 తులాల వెండి అపహరణ

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : వినాయక చవితి పండగకు సొంతూరికి వెళ్లిన దంపతులు తిరిగి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇంటిని గుల్ల చేసిన ఘటన చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని రైల్వే కాలనీలోని ప్లాట్‌ నంబర్‌ 19లో ఈ చోరీ జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం.. ఇంట్లో నివాసముండే దంపతులు వినాయక చవితి సందర్భంగా ఈ నెల 12న శనివారం సొంతూరికి వెళ్లారు. బుధవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపు తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాను పరిశీలించగా అందులో ఉంచిన సుమారు 10 తులాల బంగారం, 12 తులాల వెండి కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.వెంటనే ఇంటి యజమానులు చర్లపల్లి పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.