ఆర్ జె న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సుకు తొలుత పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, గౌరవ హైకోర్టు జోక్యంతో సభ నిర్వహణకు అనుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. అయితే, కోర్టు అనుమతి ఇచ్చిన అనంతరం కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్లను సభకు వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల అనంతరం కూడా నాయకులను నిర్బంధించడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయవ్యవస్థ పట్ల గౌరవానికి విరుద్ధమని శంభీపూర్ రాజు అన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఆ హక్కును పోలీసులు అణిచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. యువత సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. యువత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ నాయకులను నిర్బంధించిన ఘటనపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని, హౌస్ అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం, పోలీసు అధికారులను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు.
