ఆర్ జె న్యూస్, మేడ్చల్ :
మేడ్చల్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కార్యదర్శి ఎం. నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల చట్టం ప్రకారం మున్సిపల్ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఏడు నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో కార్మికుల జీతాల నుంచి కోతలు విధిస్తున్నప్పటికీ, ఒక నెల మినహా మిగిలిన ఆరు నెలల మొత్తాలను సంబంధిత ఖాతాల్లో జమ చేయలేదని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న మొత్తాలను వెంటనే జమ చేయాలని కోరారు.అదేవిధంగా కార్మికులకు అందించాల్సిన యూనిఫాంలు, చెప్పులు, షూస్, గ్లౌజులు, కొబ్బరి నూనె, క్యాపులు, రెయిన్కోట్లు, సేఫ్టీ బెల్టులు, చీపుర్లు తదితర భద్రతా సామగ్రిని వెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సుధాంష్ వేతనాల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఈఎస్ఐ–పీఎఫ్కు సంబంధించిన సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికులకు అవసరమైన భద్రతా సామగ్రిని 15 రోజుల్లో అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి గణేష్, కోశాధికారి రాజ్కుమార్, నాయకులు లక్ష్మి, నర్సింగ్, వెంకటేష్, సత్వ, పోచమ్మ, నిలమ్మ, నాగమణి, శ్రీకాంత్, మేడ్చల్ డివిజన్ నాయకులు మల్లేష్, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
