🔸15 కేసులు పరిష్కారం.. రూ.24,800 జరిమానా
🔸ఆరుగురికి జైలు శిక్ష
ఆర్ జె న్యూస్ మేడ్చల్ : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 15 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను సోమవారం మేడ్చల్లోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, 7వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.కేసులను విచారించిన న్యాయస్థానం నిందితులకు మొత్తం రూ.24,800 జరిమానా విధించింది. అలాగే ఆరుగురికి సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇందులో ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష, మరో నలుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించింది.
🔸ప్రమాదాలకు ప్రధాన కారణం
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు పాల్పడే వారిపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
