⚫ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలను వీడాలి: రామన్నగారి రాఘవేందర్ గౌడ్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ :
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను అవలంభిస్తూ ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తోందని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యాలను ఎండగడుతూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోరాటం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం దుర్మార్గమైన చర్య అని రామన్నగారి రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారిపై పోలీసు బలగాలను ప్రయోగించడం అప్రజాస్వామికమన్నారు. వెంటనే విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై లాఠీచార్జ్కు కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రామన్నగారి రాఘవేందర్ గౌడ్ కోరారు.
