ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్ రూం కాలనీలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా హిందువులు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టగా, అన్నదానంపై మాంసం వేశారనే ఆరోపణతో వివాదం తలెత్తింది. దీంతో సైదాబాద్ ప్రధాన రహదారిపై హిందూ సంఘాల నాయకులు, స్థానికులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న మాదన్నపేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలతో మాట్లాడి శాంతింపజేశారు. ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
