🔸350 మీటర్ల జాతీయ పతాకంతో పీవీ పాఠశాల విద్యార్థుల ఘన తిరంగా ర్యాలీ
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ పట్టణంలో పీవీ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని చాటింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు సుమారు 350 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ పట్టణంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేశారు. జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు నివాళులర్పించారు. భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లడం స్థానికులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పీవీ పాఠశాల డైరెక్టర్ నరసింహులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు ఘనంగా నిర్వహించాలని కోరారు. పాఠశాల డైరెక్టర్ రామేశ్వరరావు మాట్లాడుతూ.. జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీతో మేడ్చల్ పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడి ముందుగానే ప్రారంభమైందని పలువురు పేర్కొన్నారు.
